కర్నూలు: నంద్యాల జిల్లాకు చెందిన వైకాపా నేత బైరెడ్డి సిద్దార్థరెడ్డిపై కర్నూలు త్రీటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సిద్దార్థరెడ్డిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇటీవల కర్నూలు కలెక్టరేట్ వద్ద వైకాపా నేతలు నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్ని బైరెడ్డి.. మంత్రిని ఉద్దేశించి తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఓ ఫార్మా కంపెనీ నుంచి మంత్రి టీజీ భరత్‌ రూ.45 కోట్లు లంచం తీసుకున్నారని బహిరంగంగా ఆరోపించారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి భరత్... బైరెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుటుంబ సభ్యులను కూడా తీవ్రంగా అవమానించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అతనిపై పరువు నష్టం దావా కూడా వేస్తానని మంత్రి స్పష్టం చేశారు.